Saturday, August 18, 2012

దేవుడా దేవుడా ....ఎంతపని చేస్తివిరా ...('దేవుడు చేసిన మనుషులు' రివ్యూ)

 
 
 
 
puri devudu chesina manushulu review పూరీ, రవితేజ కాంబినేషన్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్. దానికి కారణం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్,అమ్మా నాన్న తమిళ అమ్మాయి,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం వంటి ఘన విజయం సాధించిన సినిమాలు వీరి ఖాతాలో ఉండటం. రవితేజని హీరో చేసి ఆ తరువాత స్టార్ హీరో ఇమేజ్ ఇచ్చిన పూరి జగన్నాధ్ ఇప్పటి వరకు రవితేజతో నాలుగు సినిమాలు తీసాడు. మొదటి మూడు హిట్ సినిమాలు ఇచ్చిన వీరు నేనింతే సినిమాతో నిరాశ పరిచారు. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐదవ సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’ విడుదలకి ముందు ఏమాత్రం ఆసక్తి రేకెత్తించ లేకపోయింది.  అయినా స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ ఎఫెక్టుతో ఓపినింగ్స్ బాగున్నా దాన్ని నిలబెట్టుకునే పరిస్ధితి కనపడటం లేదుఈరోజే విడుదలైన ఈ సినిమా వరుస ఫ్లాపులతో సతమవుతున్న రవితేజకి, పూరీకి హిట్ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథలోకి  వెళితే  :
 అక్షయ తృతీయ రోజు అలిగిన లక్ష్మి దేవి (కోవై సరళ)ని బుజ్జగించడానికి విష్ణు మూర్తి (బ్రహ్మానందం) చెప్పిన కథతో ఈ సినిమా కథ మొదలవుతుంది. హైదరాబాదులో అనాధగా పెరిగి మధ్యవర్తిగా పనిచేసే రవితేజ (రవితేజ)కి, బ్యాంకాక్లో అనాధగా పెరిగి టాక్సీ డ్రైవరుగా పనిచేసే ఇలియానా మధ్య ప్రేమ పుట్టించడానికి పనిలేని పాపయ్య తో అరటి ‘తొక్క’ వేయిస్తాడు విష్ణు మూర్తి. ఆ తొక్క ద్వారా రవితేజ బ్యాంకాక్ వెళతాడు. అక్కడ ఇలియానాని కలుస్తాడు. ఇద్దరు ప్రేమించుకుని కలుసుకునే సమయంలో కొట్టుకుని విడిపోతారు.సెకండాఫ్ కి వస్తే... ఎమ్.ఎస్ నారాయణం తొక్క పాడేయకపోతే ఏం జరుగుతుంది అన్న కోణంలో ఇదే కథ కొద్ది పాటి మార్పులతో రిపీట్ అవుతుంది. అదేమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రవితేజ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా నటించాడు. ఆయన గత మూడు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో బెటర్ అవుట్ పుట్ ఇచ్చాడు. కానీ రవితేజ మ్యానరిజంస్,డైలాగ్ డెలవరీ బోర్ కొట్టే స్ధితికి చేరుకున్నట్లు ఈ సినిమా గుర్తు చేస్తుంది. అలాగే చిత్రంగా ఇందులో పూరీ మార్కు డైలాగులు కూడా పెద్దగా లేవు.. ఉన్న కొద్దీ పేలలేదు ఇలియానా నటనలో ఏ మాత్రం మార్పు లేదు. పాటల్లో అందంగా కనపడింది. ప్రకాష్ రాజ్ మతిపరుపు డాన్ పాత్ర విభిన్నంగా ఉండటం దానికి అయన పెర్ఫార్మన్స్ తోడవడంతో బాగానే పండింది. బ్రహ్మానందం, కోవై సరళ పాత్రలకి పూరి పంచ్ డైలాగులు తోడవడంతో వారి మధ్య సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. 'గోలి'గా అలీ నవ్వించే ప్రయత్నం చేసాడు.
పూరికి స్క్రీన్ప్లే మీద రోజు రోజుకి పట్టు తగ్గుపోతుంది అని ఈ సినిమా చుసిన తరువాత స్పష్టంగా అర్ధమవుతుంది. ఫస్టాఫ్ వరకు ఎంటర్తైన్మెంట్ పర్వలేదనిపిస్తూ సాగినా సెకండాఫ్ ఏ మాత్రం ఆసక్తి లేకుండా విసుగు తెప్పించింది.  మధ్యలో అలీ, లక్ష్మి దేవి సైడ్ ట్రాక్ మొదట్లో పర్వాలేదనిపించినా రాను రాను విసుగు వచ్చింది. సంతోషకరమైన విషయం ఏంటంటే అలీ డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోవడం. గ్యాబ్రియేలతో చేయించిన డిస్టబ్ చేత్తున్నాడే పాట కూడా ఆకట్టుకోలేదు. రఘు కుంచె సంగీతంలో ఆకట్టుకొనే పాటలు లేకపోగా నేపధ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. రవితేజ, ఇలియానా మధ్య బలమైన ప్రేమ సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకుడు కనీసం కామెడీ అయినా ఉంటుందేమో అని పక్క వైపు చూస్తే పూరి అక్కడ కూడా మొండి చేయి చూపించాడు. క్లైమాక్స్ సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్, ఇలియానా మధ్య అన్నా, చెల్లెలు సెంటిమెంట్ సీన్స్ చూడకుండానే ప్రేక్షకులు బైటికి వెల్లిపోయేలా ఉన్నాయి.

ఈ విభాగంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ గురించి. బ్యాంకాక్ ని ప్రతి సినిమాలో చూస్తున్నా ఈ సినిమాలో ఇంకా బాగా చూపించారు.  . డైలాగుల్లో పూరి మార్కు పంచులు లేవు.
రవితేజ, పూరి జగన్నాధ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు మినిమం గ్యారంటీ అని ఆశిస్తారు. దేవుడు చేసిన మనుషులు కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆశించిన వెళ్ళిన వారికి ‘తొక్క’లో  కథ చెప్పి పంపించాడు. ఫస్టాఫ్ వరకు ఓకే అనిపించినా సెకండాఫ్ ఓ మోస్తరుగా ఉంది .దేవుడా దేవుడా ....ఎంతపని చేస్తివిరా ........అనుకుంటూ బయటికి రావాలి ప్రేక్షకుడు .
                              .......మరి పూరీ గారు 'కేమరామేన్ గంగతో రాంబాబు' ఎలా తీస్తాడో అని పవన్ కళ్యాణ్ అబిమానులు బయపటటం ఖాయం . 
నా  రేటింగ్: 2.5/5(  మరీ ఎక్కువగా ఇచ్చినట్లున్నాను )